ఎన్టీఆర్ కు 'భారతరత్న' ఇవ్వాలని కేంద్రాన్ని కోరండి: సీఎం జగన్ కు రఘురామకృష్ణరాజు లేఖ

  • ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి
  • 'భారతరత్న' అంశాన్ని తెరపైకి తెచ్చిన రఘురామ
  • ఎన్టీఆర్ కోసం కేంద్రం వద్దకు వెళ్లాలని సూచన
  • ఈ ఏడాదైనా 'భారతరత్న' వచ్చేలా చూడాలని విజ్ఞప్తి
ప్రతి తెలుగువాడు గర్వించదగిన నటుడు, నేత ఎన్టీఆర్. ఇవాళ ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావుకు 'భారతరత్న' అవార్డు కోసం కేంద్రాన్ని కోరాలని సీఎం జగన్ కు సూచించారు.

ప్రజాబాహుళ్యంలోకి వచ్చి పార్టీ పెట్టిన 9 నెలలకే ముఖ్యమంత్రి అవడమే కాకుండా, బలహీన వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఖ్యాతి పొందారని వివరించారు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడిచాయని రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు.

ఎన్టీఆర్ కు ఈ ఏడాది అయినా 'భారతరత్న' అవార్డు ఇవ్వాలంటూ ఓ ప్రతినిధి బృందాన్ని కేంద్రం వద్దకు పంపాలని ఇవాళ ఆయన  వర్ధంతి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. జాతీయస్థాయి అవార్డులు రిపబ్లిక్ డే నాడు ప్రకటించే అవకాశం ఉన్నందున మీరు కేంద్రాన్ని గట్టిగా కోరాలి. అందుకు సమయం తక్కువగా ఉన్నందున మీరే స్వయంగా వెళ్లి కోరితే బాగుంటుంది అని రఘురామకృష్ణరాజు తన లేఖలో పేర్కొన్నారు.

Raghu Rama Krishna Raju
Jagan
Bharataratna
NTR
Andhra Pradesh

More Telugu News