Andhra Pradesh: గత ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం

AP Government to rebuild temples
  • కృష్ణా పుష్కరాల సమయంలో ఆలయాల కూల్చివేత
  • విజయవాడలో 21 ఆలయాల కూల్చివేత
  • పలు విడతల్లో పునర్నిర్మిస్తామన్న మంత్రి వెల్లంపల్లి
  • ఎల్లుండి దుర్గగుడి పనులకు శంకుస్థాపన
కృష్ణా పుష్కరాల సమయంలో టీడీపీ హయాంలో కూల్చివేసిన ఆలయాలను తాము పునర్నిర్మిస్తున్నామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. చంద్రబాబు పాలనలో విజయవాడలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. పుష్కరాల సమయంలో ప్రకాశం బ్యారేజి వద్ద సుమారు 21 ఆలయాలు కూల్చివేసినట్టు తెలుస్తోంది. అయితే తొలి విడతగా వాటిలో 8 ఆలయాలను పునర్నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

తొలి దశ పూర్తయిన తర్వాత రెండో విడతలో మరికొన్ని ఆలయాల పునర్నిర్మాణం ఉంటుందని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూల్చివేతలకు గురైన ఆలయాలను కూడా నిర్మించే ఆలోచనలో ఏపీ సర్కారు ఉంది. ఈ మేరకు మంత్రి వెల్లడించారు. కాగా, ఈ నెల 8న దుర్గగుడి అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. బెజవాడ కనకదుర్గ గుడి అభివృద్ధి పనులకు సర్కారు రూ.70 కోట్లు ఖర్చు చేయనుంది.
Andhra Pradesh
Rebuild Temples
Vijayawada
YSRCP
Jagan

More Telugu News