Bandi Sanjay: బీజేపీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు... వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇంటికే!: బండి సంజయ్

KCR is afraid of  BJP says Bandi Sanjay
  • వరంగల్ లో ఓడిపోతామనే కేసీఆర్ ఎన్నికలు పెట్టడం లేదు
  • వరంగల్ వరద బాధితులకు కేసీఆర్ ఎందుకు సాయం చేయలేదు
  • వరంగల్ లో టీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారు 
ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని చూసి కేసీఆర్ భయపడుతున్నారని... వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇంటికి పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వరంగల్ లో కూడా రాబోతున్నాయని... అందుకే వరంగల్ లో ఎన్నికలు పెట్టడం లేదని అన్నారు. వరంగల్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ లో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ ఇక్కడకు రాలేదని, హైదరాబాద్ వరద బాధితులకు ఇచ్చిన విధంగా వరంగల్ బాధితులకు రూ. 10 వేలు ఎందుకు ఇవ్వలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. వరంగల్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని సర్వేలు చెపుతున్నాయని... అందుకే ఇక్కడ ఎన్నికలు పెట్టడం లేదని అన్నారు.

వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 196 కోట్లు ఇచ్చిందని... కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించిందని... వరంగల్ కోసం కేవలం రూ. 40 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని మండిపడ్డారు. వరంగల్ లో టీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు.

More Telugu News

Bandi Sanjay
BJP
KCR
TRS