Mohan Raja: మెగా హీరోలతో మోహన్ రాజా రెండు ప్రాజెక్టులు!

  • 'హనుమాన్ జంక్షన్' చేసిన మోహన్ రాజా 
  • తరువాత తమిళంలో దర్శకుడిగా బిజీ
  • చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ కి దర్శకత్వం
  • తర్వాత రామ్ చరణ్ తో మరో సినిమా  
Director Mohan Raja signs for two projects in Mega family

మోహన్ రాజా తమిళంలో మంచి పేరున్న దర్శకుడు. గతంలో తెలుగులో 'హనుమాన్ జంక్షన్' చిత్రానికి దర్శకత్వం వహించిన రాజా, ఆ తర్వాత తమిళంలో బిజీ అయిపోవడం వల్ల తెలుగులో మళ్లీ చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటించే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ మళ్లీ టాలీవుడ్ కి వస్తున్నాడు.

మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడిగా మోహన్ రాజాను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా కూడా ప్రకటించారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' తర్వాత లూసిఫర్ రీమేక్ మొదలవుతుంది. అది వచ్చే వేసవికి పూర్తవుతుంది. ఆ తర్వాత కూడా మోహన్ రాజా మెగా ఫ్యామిలీ హీరో చిత్రానికే దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.

గతంలో మోహన్ రాజా తమిళంలో 'తని ఒరువన్' హిట్ చిత్రాన్ని రూపొందించాడు. తెలుగులో ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేశారు. ఇప్పుడు 'తని ఒరువన్'కి మోహన్ రాజా సీక్వెల్ చేయనున్నట్టు, అందులో రామ్ చరణ్ హీరోగా నటించనున్నట్టు సమాచారం.

తెలుగు, తమిళ భాషల్లో దీనిని ఏకకాలంలో నిర్మిస్తారట. వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ చిత్రం సెట్స్ కి వెళుతుందని అంటున్నారు. 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' చిత్రాల తర్వాత చరణ్ చేసే చిత్రం ఇదే అవుతుందని తెలుస్తోంది. మొత్తానికి మోహన్ రాజా మెగా ఫ్యామిలీలో అలా ఒకదాని తర్వాత మరొకటి చేస్తున్నాడన్నమాట!

More Telugu News