భారీ పౌరాణిక చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు?

  • అల్లు అరవింద్ నిర్మిస్తున్న రామాయణం  
  • నితీశ్ తివారి, రవి ఉద్యావర్ దర్శకత్వం 
  • తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో నిర్మాణం 
  • సంభాషణలు రాసి ఇచ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ 
తనదైన బ్రాండ్ తో పంచ్ డైలాగులు.. మంచి డైలాగులు రాస్తూ మాటల మాంత్రికుడిగా పేరుతెచ్చుకున్న ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా ఓ పౌరాణిక చిత్రానికి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఓపక్క దర్శకుడిగా బిజీగా ఉన్నప్పటికీ తాజాగా రామాయణకథకు ఆయన మాటలు రాసినట్టు వార్తలొస్తున్నాయి.  

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాము రామాయణాన్ని తెరకెక్కిస్తున్నట్టు, భారత చలన చిత్రసీమ కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్ర నిర్మాణం జరుగుతుందని మూడేళ్ల క్రితం ప్రకటించారు. ఈ చిత్రనిర్మాణంలో నమిత్ మల్హోత్రా, మధు వంతెన కూడా భాగస్వాములు అవుతారని ఆయన తెలిపారు. సుమారు 1500 కోట్ల బడ్జెట్టుతో రామాయణం సీరీస్ ను చిత్రాలుగా నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ చిత్రనిర్మాణంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రచయితగా తన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ఇప్పటికే ఆయన సంభాషణలు రాయడం పూర్తిచేసినట్టు చెబుతున్నారు. అల్లు అరవింద్ పట్టుబట్టడం వల్ల ఇటీవల లాక్ డౌన్ సమయంలో ఈ చిత్రానికి ఆయన మాటలు రాసి, బైండు అప్పజెప్పినట్టు తెలుస్తోంది.

తెలుగు, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో త్రీడీ ఫార్మాట్ లో నిర్మించే ఈ చిత్రానికి 'దంగల్' ఫేమ్ నితీశ్ తివారీ, 'మామ్' ఫేమ్ రవి ఉద్యావర్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు. వివిధ భాషలకు చెందిన నటీనటులను దీనికి ఎంపిక చేసే పనిలో చిత్ర బృందం వుంది.


More Telugu News

Trivikram Srinivas Allu Aravind Ramayan