బ్యాంకు లీల.. రైతు ఖాతాలో జమ అయిన రూ. 473 కోట్లు!

Rs 473 Crores Deposited in Telangana Farmer
  • గంధమల గ్రామానికి చెందిన రైతు సంజీవరెడ్డి
  • డబ్బుకోసం ఏటీఎంకు వెళితే బ్యాలెన్స్ గా వందల కోట్లు
  • అప్పటికే ఎకౌంట్ ను ఫ్రీజ్ చేసిన బ్యాంకు అధికారులు
మన బ్యాంకుల లీలలు అంటే ఇదే.. తెలంగాణలోని ఓ రైతు బ్యాంకు ఖాతాలో ఎలా జమ అయ్యాయో తెలియదుగానీ, ఒక్కసారిగా రూ. 473 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఆ రైతు అవాక్కయ్యాడు.

ఆ వివరాల్లోకి వెళితే, యాదాద్రి భువనగిరి జిల్లా గంధమల గ్రామానికి చెందిన అనుమూల సంజీవరెడ్డి అనే రైతుకు దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. అతను బుధవారం నాడు జగదేవ్ పూర్ కు ఓ పని నిమిత్తం వెళ్లి, తన అవసరార్థం డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బు రాకపోవడంతో, బ్యాలెన్స్ చూసుకోగా, ఏకంగా రూ. 473,13,30,000 ఉన్నట్టు చూపించింది.

దీంతో ఆశ్చర్యపోయిన అతను, పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చెక్ చేసుకున్నా, అంతే బ్యాలెన్స్ ఉన్నట్టు చూపింది. తన ఖాతాలో అంత డబ్బు ఎవరు వేశారన్న విషయాన్ని కనుక్కునేందుకు తన ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లగా, సదరు రైతు ఖాతా ఫ్రీజ్ అయిందని అధికారులు వెల్లడించారు. అతని ఖాతాలో కేవలం రూ. 4 వేలు మాత్రమే ఉన్నాయని కూడా స్పష్టం చేశారు. తమ ప్రాంతానికి చెందిన సంజీవ రెడ్డి ఖాతాలో కోట్ల కొద్దీ డబ్బులు పడ్డాయన్న విషయం తుర్కపల్లి మండల ప్రాంత గ్రామాల్లో చర్చనీయాంశమైంది.
Go Back to Shorts
Telangana
Farmer
Account

More Telugu News