రాజకీయాల్లో ఏదైనా జరుగుతుంది... రజనీకాంత్ రాకను స్వాగతిస్తున్నాం: పన్నీర్ సెల్వం

రాజకీయ రంగప్రవేశంపై ఇన్నాళ్లు ఊరిస్తూ వస్తున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనిపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ.పన్నీర్ సెల్వం స్పందించారు. మహానటుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. రాజకీయాల్లో ఏమైనా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏ కాస్త అవకాశం ఉన్నా, రజనీకాంత్ స్థాపించబోయే పార్టీతో పొత్తు కుదరొచ్చని అన్నారు.

కాగా, రజనీకాంత్ తన పార్టీ వ్యవహారాలకు సంబంధించి కసరత్తులు మొదలు పెట్టారు. పార్టీ ఏర్పాటు వ్యవహారాల పర్యవేక్షకుడిగా తమిళ్ రువి మణియన్ ను నియమించారు. ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించారు. పార్టీ కార్యకలాపాలు జనవరిలో ప్రారంభం అవుతాయని రజనీ తెలిపారు. తనను కీలక పదవిలో నియమించడం పట్ల తమిళ్ రువి మణియన్ స్పందిస్తూ, రజనీకాంత్ రాముడైతే తాను ఓ ఉడుతలా సేవలందిస్తానని తెలిపారు.


More Telugu News