Revanth Reddy: మోదీ, అమిత్ షాలు గోబెల్స్ అన్నదమ్ములు: రేవంత్

  • అభివృద్ధి చేయకున్నా చేసినట్టు ప్రచారం
  • హైదరాబాద్ పేరు, సంస్కృతిని మార్చేస్తామంటూ విద్వేషాలు
  • బీజేపీ ఎదుగుదల వెనక టీఆర్ఎస్
Congress MP Revanth Reddy described Modi and Amit Shah are gobel brothers

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు గోబెల్స్ అన్నదమ్ములని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఏమాత్రం అభివృద్ధి చేయకున్నా చేసినట్టు చెప్పి ప్రచారం చేసుకోవచ్చని వీరిద్దరూ నిరూపించారని విరుచుకుపడ్డారు. చారిత్రక నగరమైన హైదరాబాద్ పేరును, సంస్కృతిని మార్చేస్తామని కొందరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చిందన్న రేవంత్.. టీఆర్ఎస్‌కు ఎంఐఎం మద్దతు ఇస్తోందని, అది బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోందని విమర్శించారు.

ఒవైసీ మాటలు విని నగరంలోని మైనారిటీలు టీఆర్ఎస్‌కు ఓటేస్తుంటే, అది మాత్రం బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోందన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంలు కాంగ్రెస్‌ను బలహీన పరచడానికి ప్రయత్నించడం వల్లే ఇక్కడ బీజేపీ ఎదుగుతోందని, దాని ఎదుగుదల వెనక టీఆర్ఎస్ ఉందని ఆరోపించారు. వరదల సమయంలో రాని బీజేపీ నాయకులు ఇప్పుడు మాత్రం క్యూకడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌పై ప్రేమ ఉంటే ఆయనను ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి తప్పితే ఎంఐఎంకు మాత్రం ఓటెయ్యవద్దని ప్రజలకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

More Telugu News