కస్టమర్లను నానా ఇబ్బందులు పెట్టిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సర్వర్లు!

  • డేటా సెంటర్లలో లోపాలు
  • సోషల్ మాధ్యమాల వేదికగా ఫిర్యాదులు
  • నిన్న సాయంత్రం ప్రారంభమైన సమస్య
హెచ్డీఎఫ్సీ డేటా సెంటర్లలో ఏర్పడిన లోపం కారణంగా నిన్న బ్యాంకు సర్వర్లు పనిచేయక పోవడంతో కస్టమర్ల నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, ఏటీఎం సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ఎంతో మంది బ్యాంకు కస్టమర్లు తాము సేవలను అందుకోలేకపోతున్నామని, తమ డెబిట్, క్రెడిట్ కార్డులు నిరుపయోగం అయ్యాయని సామాజిక మాధ్యమాల వేదికగా ఫిర్యాదులు చేశారు. ఇండియాలో అతిపెద్ద ప్రైవేటు సెక్టార్ బ్యాంకుగా ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఈ సమన్య నిన్న సాయంత్రం నుంచి మొదలైంది. తమ ఈఎంఐలను చెల్లించలేకపోయామని, ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ సేవలు నిలిచాయని, కనీసం ఏటీఎంల నుంచి డబ్బు కూడా రాలేదని కస్టమర్లు ఫిర్యాదులు చేశారు.

కాగా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు డేటా సెంటర్లలో ఇలా లోపాలు ఏర్పడటం ఇదే తొలిసారేమీ కాదు. గత సంవత్సరం డిసెంబర్ లో కూడా సంస్థ ఇదే విధమైన సమస్యను ఎదుర్కోగా, ఆర్బీఐ తీవ్రంగా స్పందించి, విచారణకు ఓ టీమ్ ను కూడా నియమించిన సంగతి గుర్తుండే ఉంటుంది. సేవా లోపాలపై స్పందించాలని బ్యాంకు అధికారులకు పంపిన ఈ-మెయిల్ కు సమాధానం రాకపోవడం గమనార్హం. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ఇక గత రాత్రంతా ఇదే సమస్య ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం మాత్రం కొన్ని రకాల సేవలు పునరుద్ధరించినట్టు నెటిజన్లు వెల్లడించారు.


HDFC Bank
Deta Servers
Outage
Data Centers

More Telugu News