వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను త్వరలో ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయం

ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని తెలంగాణ సీఎంవో తెలిపింది.

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభించాలి? వీలైనంత త్వరగా ప్రారంభించడానికి ఏం చేయాలి? అనే విషయాలు చర్చించడానికి సీఎం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారని తెలిపింది. సీఎస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొంటారని తెలిపింది.

కాగా, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను విజయవంతం చేయాలని,  వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల కోసం దేశంలో ఎక్కడా ఇలాంటి పోర్టల్‌ లేదని కేసీఆర్ నిన్న ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. ఈ సమావేశంలో కేసీఆర్‌ ధరణి పోర్టల్‌పైనే ప్రధానంగా మాట్లాడారు. ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు కేసీఆర్.


More Telugu News