హీరో రాజశేఖర్‌ వెంటిలేటర్‌పై ఉన్నారన్న వార్తలను ఖండించిన జీవిత

  • ఆరోగ్యం విషమించినప్పటికీ, వెంటిలేటర్ మీద మాత్రం లేరు
  • విషమ పరిస్థితి నుంచి బయటపడ్డారు
  • ఐసీయూ నుంచి కూడా బయటకు వస్తారు
సినీ నటుడు రాజశేఖర్‌తో పాటు ఆయన భార్యాపిల్లలు కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన భార్యాపిల్లలు కోలుకున్నప్పటికీ రాజశేఖర్ త్వరగా కోలుకోలేకపోయారు. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో ఐసీయూలో ఆయన చికిత్స తీసుకుంటోన్న నేపథ్యంలో ఆయన భార్య జీవిత మాట్లాడారు.

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడిందని, ఆయన త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. సిటీ న్యూరో సెంటర్ వైద్యులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, దీంతో రాజశేఖర్  విషమ పరిస్థితి నుంచి బయటపడ్డారని ఆమె తెలిపారు. రాజశేఖర్ త్వరలోనే ఐసీయూ నుంచి కూడా బయటకు వస్తారని చెప్పారు.

అయితే, రాజశేఖర్ వెంటిలేటర్ మీద ఉన్నారని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. రాజశేఖర్ అసలు ఎప్పుడూ వెంటిలేటర్ మీద లేరని వివరించారు. ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించినప్పటికీ, వెంటిలేటర్ మీద మాత్రం లేరని చెప్పారు.

ఆయనకు నాన్ ఇన్‌వాసివ్ వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందించారని వివరించారు. తమ స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు చేసిన ప్రార్థనలు వల్లే ఆయన కోలుకుంటున్నారని, ఆయన త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని చెప్పారు.


More Telugu News

Rajasekhar jeevita Tollywood Corona Virus COVID19