వైసీపీ-టీడీపీ రహస్య ఒప్పందాన్ని బయట పెట్టాలి: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • పోలవరంకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోంది
  • టీడీపీపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు?  
  • ఏపీలో రివర్స్ పాలన సాగుతోంది  
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని బీజేపీ ఏపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు అంచనాలు ఎంత అనే విషయాన్ని చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదని... పోలవరం అథారిటీ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టు, హౌసింగ్ స్కీమ్ లో అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపించిందని... అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా టీడీపీపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు.

వైసీపీ-టీడీపీ మధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీలో జరుగుతున్నది రివర్స్ టెండరింగ్ కాదని... రివర్స్ పాలన జరుగుతోందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నప్పటికీ వైసీపీ నేతలు కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఇతర పార్టీలకు మనుగడ లేకుండా విపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు పేర్లు మార్చడం... సొంత పథకాలుగా ప్రచారం చేసుకోవడం సాధారణ అంశంగా మారిందని విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు.

Vishnu Vardhan Reddy
BJP
Telugudesam
YSRCP
Polavaram Project

More Telugu News