Harish Rao: రేవంత్ రెడ్డిని కొడంగల్ పోయి ఓడించా... ఇది నా అడ్డా... వాళ్లొచ్చి ఏంచేస్తారు?: హరీశ్ రావు

  • దుబ్బాకలో హరీశ్ రావు ప్రచారం
  • బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు చేసిన హరీశ్ రావు
  • టీఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖాయమైందని వ్యాఖ్యలు
Harish Rao campaigns in Dubbaka

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తరఫున మంత్రి హరీశ్ రావు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థుల విమర్శలకు దీటైన జవాబిస్తూ, ప్రచార తీవ్రతను మరింత పెంచారు. తాజాగా మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడెక్కడి లీడర్లో వచ్చి దుబ్బాకలో ప్రచారం చేస్తున్నారని, ఎన్నికలయ్యాక వాళ్లెవరైనా ఇక్కడ ఉంటారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని కొడంగల్ పోయి ఓడించానని, దుబ్బాక తన అడ్డా అని, ఇక్కడకు ఎవరొచ్చి ఏంచేయగలరని వ్యాఖ్యానించారు.

అభివృద్ధిని కళ్లుండీ చూడలేని పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ అంటూ విమర్శించారు. సీసాలు, పైసలు, అవాస్తవాలనే నమ్ముకున్నారని, బీజేపీకి పరాయి నేతలు, కిరాయి మనుషులే దిక్కయ్యారని అన్నారు.

హరీశ్ రావు ఇవాళ రాయపోల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లోనూ ప్రసంగించారు. టీఆర్ఎస్ కు లభిస్తున్న ప్రజాదరణ చూసి కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెల్లో గుబులు పుడుతోందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ ఏకపక్ష విజయం ఖాయమని అన్నారు. దుబ్బాకలోనూ టీఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖాయమైందని పేర్కొన్నారు.

More Telugu News