అందుకే జగన్ ఇలాంటి దారుణ చర్యలకు పాల్పడుతున్నారు: చినరాజప్ప మండిపాటు

విశాఖలోని గీతం యూనివర్సిటీకి చెందిన కొన్ని కట్టడాలను అధికారులు కూల్చివేయడం పట్ల టీడీపీ నేత చిన రాజప్ప మండిపడ్డారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గీతం వర్సిటీపై సీఎం వైఎస్ జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, కూల్చివేతలకు ముందు నోటీసులు ఇవ్వకపోవడం సరికాదని చెప్పారు.

గత అర్ధరాత్రి దాదాపు 200 మంది సిబ్బందితో వచ్చి కూల్చేశారని తెలిపారు. ఉన్నత విద్యా సంస్థలకు సాయం చేయకుండా, ఇటువంటి చర్యలకు పాల్పడడం సరికాదని అన్నారు. కూల్చివేతలు, కుట్రలతోనే వైసీపీ సర్కారు పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు. జగన్ తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసమే ఇలాంటి దారుణ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.


More Telugu News