ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి సమాజంలో బతకడానికి చోటులేదు: దీక్షిత్ హత్యపై మంత్రి సత్యవతి

  • దీక్షిత్‌రెడ్డి  కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి
  • నిందితుడిని కఠినంగా శిక్షించాలని వ్యాఖ్య
  • తమ సర్కారు అండగా ఉంటుందని హామీ  
మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో అపహరణకు గురైన దీక్షిత్ రెడ్డి (9)ని కిడ్నాపర్లు హత్య చేసిన విషయం తెలిసిందే. మెకానిక్ మందసాగర్ అనే వ్యక్తి బాలుడిని హత్య చేశాడని పోలీసులు ఇప్పటికే తేల్చారు. ఈ బాలుడి కిడ్నాప్, హత్యను తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి దారుణాలకు పాల్పడే వారికి సమాజంలో బతకడానికి చోటులేదని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని అన్నారు.

దీక్షిత్‌రెడ్డి  కుటుంబాన్ని సత్యవతి రాథోడ్ ఈ రోజు‌ పరామర్శించారు. శనిగపురం వెళ్లిన ఆమె బాలుడి తల్లిదండ్రులు రంజిత్‌రెడ్డి, వసంతతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పారు. వారికి తమ సర్కారు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిందితులు సాంకేతికతను వినియోగించుకుని ఇటువంటి ఘటనలకు పాల్పడడానికి ప్రయత్నం చేయడం విచారకరమని తెలిపారు.

Satyavathi Rathod
TRS
Telangana
Crime News

More Telugu News