ESIC: ఈఎస్ఐ ఖాతాదారులకు శుభవార్త.. ఉద్యోగాలు కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతి

unemployment benefit claim under Atal Bimit Kalyan Yojana
  • అటల్ బీమిత్ కల్యాణ్ యోజన కింద భృతి
  • వేతనంలో 50 శాతం పొందే అవకాశం
  • నేరుగా కానీ, పోస్టల్, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పంపవచ్చన్న కార్మిక శాఖ
ఈఎస్ఐ ఖాతాదారులకు ఇది శుభవార్తే. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి వారి వేతనంలో 50 శాతం సొమ్మును నిరుద్యోగ భృతిగా చెల్లించనున్నట్టు కేంద్ర కార్మికశాఖ ప్రకటించింది. అటల్ బీమిత్ కల్యాణ్ యోజన కింద ఈ సాయం అందించనున్నట్టు తెలిపింది.

 ఉద్యోగాలు కోల్పోయిన వారు సమీపంలోని ఈఎస్ఐ కార్యాలయంలో స్వయంగా  సంప్రదించి కానీ, ఆన్‌లైన్‌లో కానీ, పోస్టులో కానీ దరఖాస్తులు పంపవచ్చని పేర్కొంది. దరఖాస్తుతోపాటు ఆధార్ కాపీ, బ్యాంకు వివరాలు, అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.

ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ఏడాదిపాటు అంటే వచ్చే ఏడాది జూన్ 30 వరకు అందుబాటులో ఉండనుంది. గతంలోనూ నిరుద్యోగ భృతి లభించేది. అయితే, అప్పుడు వేతనంలో కేవలం 25 శాతం మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు దానిని 50 శాతానికి పెంచారు. అలాగే, నిబంధనలు కూడా కొంత సరళతరం చేశారు.

 గతంలో సంస్థ యజమాని ద్వారా మాత్రమే దరఖాస్తు పంపించే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు స్వయంగా కార్మికులే సమర్పించుకునేలా నిబంధనలు సడలించారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాత నిరుద్యోగ భృతి కార్మికుల బ్యాంకు ఖాతాలోనే పడనుంది. కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ అధ్యక్షతన జరిగిన ఈఎస్ఐసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ESIC
Unemployement benefits
Salary
atal bimit yojana

More Telugu News