లోక్ సభలో మిథున్ రెడ్డి కోర్టులను కించపరిచేలా మాట్లాడారు: టీడీపీ ఎంపీ రామ్మోహన్

కోర్టులపై ఆరోపణలకు వైసీపీ పార్లమెంటును కూడా వేదికగా చేసుకుంటోందని టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. లోక్ సభలో మిథున్ రెడ్డి కోర్టులను కించపరిచేలా మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై నిందలు వేయడం సరికాదని అన్నారు. ఆధారాలు లేని ఆరోపణలతోనే కోర్టుల్లో కేసులు నిలబడట్లేదని రామ్మోహన్ అభిప్రాయపడ్డారు.

నాడు అమరావతిలో రాజధాని పెడతామంటే ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ఒప్పుకున్నారని తెలిపారు. జగన్ అప్పుడొక మాట, ఇప్పుడొక మాట చెప్పి కొత్త స్కామ్ కు తెరదీశారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయని అన్నారు. సీబీఐకి కొన్ని కేసులు ఇచ్చి చేతులు దులుపుకోవాలని జగన్ సర్కారు చూస్తోందని రామ్మోహన్ ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలోని ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కేవలం హిందూ ఆలయాలపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.


More Telugu News