Prabhas: 'ఆదిపురుష్'లో బాలీవుడ్ కథానాయిక అంటూ ప్రచారం.. చిత్ర బృందం స్పందన!

  • 350 కోట్ల బడ్జెట్టుతో చిత్ర నిర్మాణం
  • రాముడిగా ప్రభాస్.. లంకేశ్ గా సైఫ్ అలీ
  • కథానాయికగా ఊర్వసి రౌతేలా అంటూ ప్రచారం
  • ఆ వార్తలో వాస్తవం లేదంటూ ఖండన
Adipurush team condemns propagand

ప్రభాస్ హీరోగా నటించే డైరెక్ట్ హిందీ చిత్రం 'ఆదిపురుష్' ప్రకటన వచ్చినప్పటి నుంచీ ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో ఈ చిత్రం వార్తలలో నిలుస్తూనే వుంది. ఓం రౌత్ దర్శకత్వంలో సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్టుతో రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని త్రీడీ ఫార్మాట్ లో తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలో లంకేశ్ గా విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నట్టు ప్రకటించగానే ఈ ప్రాజక్టుకు మరింత క్రేజ్ వచ్చేసింది.

ఇక సినిమాలో మరో ముఖ్య పాత్ర, ప్రధాన ఆకర్షణ అయిన కథానాయిక పాత్రను ఎవరు పోషిస్తారన్న విషయంపై ఇప్పటికే రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మొదట్లో కీర్తి సురేశ్ పేరును పరిశీలిస్తున్నారంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత కియరా అద్వానీ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఏకంగా ఆమె ఎంపిక పూర్తయిందని కూడా వార్తలు వినిపించాయి. తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా పేరు తెరమీదకి వచ్చింది.

దీంతో ఇకతప్పక 'ఆదిపురుష్' చిత్ర బృందం తాజాగా స్పందించింది. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని ప్రకటించింది. 'మా చిత్రంలో కథానాయిక పాత్రకు ఊర్వశి రౌతేలాని సంప్రదిస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు' అంటూ చిత్రం యూనిట్ పేర్కొంది. దీంతో ఈ ప్రచారానికి తెరపడుతుందని అనుకోవచ్చు.  

More Telugu News