నిరుద్యోగులకు శుభవార్త.. 1.40 లక్షల పోస్టుల భర్తీకి రైల్వే రెడీ!
- 1,40,640 ఉద్యోగాల కోసం రెండేళ్ల క్రితం నోటిఫికేషన్
- 2.4 కోట్ల మంది దరఖాస్తులు
- డిసెంబరు 15 నుంచి పరీక్షల ప్రక్రియను ప్రారంభించనున్న రైల్వే బోర్డు
ప్రభుత్వం ఇప్పుడు పలు సడలింపులు ఇవ్వడంతో డిసెంబరు 15 నుంచి పరీక్షల ప్రక్రియ ప్రారంభించాలని రైల్వే బోర్డు యోచిస్తోంది. ఈ మేరకు బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయనున్నట్టు చెప్పారు. అభ్యర్ధులందరికీ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడ్డాయని, త్వరలోనే పూర్తిస్థాయి షెడ్యూల్ను విడుదల చేస్తామని వినోద్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడా రూపొందిస్తున్నట్టు వివరించారు.
రైల్వే భర్తీ చేయనున్న పోస్టుల్లో నాన్ టెక్నికల్ పాప్యులారిటీ కేటగిరీ (ఎన్టీపీసీ) కింద గార్డులు, ఆఫీస్ క్లర్కులు, కమర్షియల్ క్లర్కుల ఉద్యోగాలు 35,208, మినిస్టీరియల్ కేటగిరీ కింద స్టెనో తదితర 1663 పోస్టులు, ట్రాక్ నిర్వహణ, పాయింట్మేన్ వంటి పోస్టులు 1,03,769 పోస్టులు ఉన్నాయి.