Supreme Court: నీట్, జేఈఈ వాయిదా వేయాలన్న పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Supreme Court dismiss the review petition seeking postpone of NEET and JEE
  • నీట్, జేఈఈ వాయిదాపై సుప్రీంలో 6 రాష్ట్రాల రివ్యూ పిటిషన్
  • ఇప్పుడు వాయిదా వేయడం సరికాదన్న సుప్రీం
  • ఇప్పటికే షెడ్యూల్ విడుదలైందని స్పష్టీకరణ
కరోనా పరిస్థితుల నేపథ్యంలో నీట్, జేఈఈ వంటి జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ కష్టసాధ్యమని, నీట్, జేఈఈ వాయిదావేయాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. జేఈఈ, నీట్ లను నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 6 బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు కేంద్రం నిర్ణయంపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాయి. ఆగస్టు 17న సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ రివ్యూ పిటిషన్ వేశాయి.

అయితే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు....  ఇప్పటికే కేంద్రం పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిందని, విద్యార్థులు కూడా సన్నద్ధులై ఉంటారని, ఇలాంటి తరుణంలో పరీక్షలు వాయిదా వేయడం సరికాదని అభిప్రాయపడింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్నందున అందుకు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని, పరీక్ష కేంద్రాలను శుద్ధి చేయడం, శానిటైజర్లు అందుబాటులో ఉంచడం వంటి చర్యలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలంటూ ప్రభుత్వాలకు నిర్దేశించింది.
Supreme Court
NEET
JEE
Review Petition
Corona Virus

More Telugu News