రైనా మేనత్త కుటుంబంపై దాడి ఘటనలో సిట్ నియామకం

Punjab CM Amarinder Singh appoints SIT on Parhankot attack
  • ఇటీవల పంజాబ్ లో దారుణం
  • రైనా బంధువులపై దొంగల దాడి
  • ఇద్దరు మృతి
పంజాబ్ లోని పఠాన్ కోట్ లో ఇటీవల ఓ కాంట్రాక్టరు కుటుంబంపై దోపిడీ దొంగలు అత్యంత పాశవికంగా దాడి చేయడం తెలిసిందే. ఈ దాడిలో కాంట్రాక్టరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన తల్లి, భార్య, ఇద్దరు కుమారులు తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. చికిత్స పొందుతూ కుమారుల్లో ఒకరు మరణించారు. అయితే, ఈ ఘటనలో బాధితులు క్రికెటర్ సురేశ్ రైనా బంధువులు అని ఆలస్యంగా వెల్లడైంది. రైనా మేనత్త కుటుంబంపైనే దొంగలదాడి జరిగిందని తెలిసింది.

రైనా కూడా యూఏఈ నుంచి భారత్ తిరిగొచ్చేయడంతో ఈ ఘటన తీవ్రత వెల్లడైంది. ఇప్పుడతని మేనత్త చావుబతుకుల్లో ఉంది. దాంతో ఈ ఘటనకు కారకులపై కఠినచర్యలు తీసుకోవాలంటూ రైనా పంజాబ్ సీఎంను కోరాడు. ఈ నేపథ్యంలో సీఎం అమరీందర్ సింగ్ వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఈ కేసును త్వరగా తేల్చేందుకు సిట్ ను నియమించినట్టు తెలిపారు.

"బేటా, ఈ ఘటనకు కారకులను తప్పకుండా శిక్షిస్తాం" అంటూ రైనాకు సీఎం మాటిచ్చారు. కాగా, రైనా మేనత్త కుటుంబంపై దాడి చేసింది అత్యంత కిరాతకులైన 'కాలే కచ్చే గ్యాంగ్' సభ్యులని భావిస్తున్నారు.
Go Back to Shorts
SIT
Assault
Pathankot
Punjab
Suresh Raina

More Telugu News