Prashant Bhushan: తన వ్యాఖ్యలపై పునరాలోచించుకోవడానికి ప్రశాంత్ భూషణ్ కు రెండు రోజుల గడువిచ్చిన సుప్రీంకోర్టు

  • సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లపై ప్రశాంత్ భూషణ్ విమర్శలు
  • పశ్చాత్తాప పడితే చాలన్న జస్టిస్ అరుణ్ మిశ్రా
  • భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా లక్ష్మణ రేఖ ఉంటుందని వ్యాఖ్య
Supre Court gives 2 days time to Prashat Bhushan to reconsider his statement

 ట్విట్టర్ ద్వారా తాను చేసిన వ్యాఖ్యలపై పునరాలోచించుకునేందుకు కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు రెండు రోజుల గడువును ఇచ్చింది. విచారణ సందర్భంగా జస్టిన్ అరుణ్ మిశ్రా మాట్లాడుతూ ప్రపంచంలో తప్పులు చేయని వారు ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు.

మీరు వంద మంచి పనులు చేసి ఉండొచ్చని... అంతమాత్రాన పది తప్పులు చేయజాలరని జస్టిస్ మిశ్రా అన్నారు. జరిగిందేదో జరిగిపోయిందని... ఈ విషయంలో మీరు పశ్చాత్తాప పడితే చాలని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇది చాలా సీరియస్ వ్యవహారమని అన్నారు. జడ్జిగా తన 24 ఏళ్ల కాలంలో కోర్టు ధిక్కరణ కేసులో ఇంత వరకు ఎవరినీ దోషిగా తాను ప్రకటించలేదని చెప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అందరికీ ఉంటుందని... అయితే, దేనికైనా లక్ష్మణ రేఖ ఉంటుందని అన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లలో అవినీతిపరులు కూడా ఉన్నారని ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరోవైపు, ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ... తన మనస్సాక్షి అంగీకరిస్తే తన వ్యాఖ్యలపై పునఃపరిశీలించుకుంటానని అన్నారు. అయితే, పెద్దగా మార్పు ఉండకపోవచ్చని చెప్పారు. తన లాయర్ ని సంప్రదిస్తానని చెప్పారు.

More Telugu News