"రైనా, మర్యాదగా వెనక్కు వెళ్లు"... 'మిస్టర్ కూల్' సహనాన్ని కోల్పోయిన ఘటనను గుర్తు చేసుకున్న ఆర్పీ సింగ్!

Dhoni Angry on Suresh Raina
  • శ్రీలంక పర్యటనలో ఘటన
  • చెప్పిన ప్లేస్ లో ఉండని సురేశ్ రైనా
  • కళ్లతోనే కోపాన్ని ప్రదర్శించిన ధోనీ
మహేంద్ర సింగ్ ధోనీ పేరు వినగానే, 'మిస్టర్ కూల్' అని, మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉండి, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడని ఎవరైనా చెబుతారు. అటువంటి ధోనీకి కూడా మైదానంలో అప్పుడప్పుడూ కోపం వస్తుంటుంది. ధోనీకి సుదీర్ఘకాలంగా సన్నిహితుడైన ఆర్పీ సింగ్, అటువంటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. తాజాగా 'క్రికెట్ డాట్ కామ్'కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్పీ సింగ్, ధోనీ, సురేశ్ రైనాల మధ్య జరిగిన ఓ ఆసక్తికర ఘటన గురించి వివరించాడు.

"ఆ మ్యాచ్ ని మేము శ్రీలంకలో ఆడుతున్నాం. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తనకు కేటాయించిన స్థానాన్ని వదిలి రైనా పదేపదే ముందుకు వస్తున్నాడు. ధోనీ, వెనక్కు వెళ్లాలని చెబుతూనే ఉన్నాడు. కొన్ని బంతుల తరువాత ఓ క్యాచ్ మిస్ అయింది. వెంటనే ధోనీకి కోపం వచ్చింది. వెంటనే మర్యాదగా వెనక్కు వెళ్లి అక్కడే ఉండాలని రైనాకు చెప్పాడు. ధోనీ మాటల్లో తీవ్ర ఆగ్రహం, గదమాయింపు కనిపించలేదుగానీ, కళ్లలో మాత్రం కనిపించింది" అని ఆర్పీ సింగ్ చెప్పాడు.

కాగా, ధోనీ భారత టీమ్ లోకి వచ్చిన తొమ్మిది నెలల తరువాత వచ్చిన ఆర్పీ సింగ్, తన కెరీర్ లో అధిక భాగం ధోనీ కెప్టెన్సీలోనే ఆడాడు. అంతర్జాతీయ మ్యాచ్ అయినా, దేశవాళీ టోర్నీ అయినా, ధోనీ ఒకేలా ఉంటాడని చెప్పుకొచ్చాడు. తాను తొలిసారిగా ధోనీని దియోధర్ ట్రోఫీలో కలిశానని, ఈస్ట్ జోన్ కు ఆడే సమయంలోనే ధోనీ తనకు బాగా తెలుసునని, బెంగళూరులో జరిగిన క్యాంప్ లో కలసి పాల్గొన్నామని పాత విషయాలను వివరించాడు.
Go Back to Shorts
MS Dhoni
Suresh Raina
RP Singh
MR Cool
Angry

More Telugu News