వైసీపీ నేతలు అప్పట్లో ఏమన్నారో తెలుపుతూ.. ఆ వీడియో పోస్టు చేసిన బుద్ధా వెంకన్న

  • అమరావతే రాజధాని అన్నట్టుగా మాట్లాడిన నేతలు
  • ప్రజల్ని మోసం చేశారంటూ జగన్ పై బుద్ధా ధ్వజం
  • దమ్ముంటే రాజీనామా చేయాలంటూ సవాల్
ఏపీలో ఇప్పుడు అమరావతి వర్సెస్ మూడు రాజధానుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమరావతినే కొనసాగించాలని విపక్ష టీడీపీ పట్టుబడుతుండగా, మూడు రాజధానులతోనే అభివృద్ధి జరుగుతుందని వైసీపీ సర్కారు చెబుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఓ ఆసక్తికర వీడియో పంచుకున్నారు.

రోజా తదితర వైసీపీ నేతలు గతంలో రాజధాని అమరావతి గురించి ఏమన్నారో ఆ వీడియోలో చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడమే జగన్ వైఖరికి నిదర్శనమని, జగన్ ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తాడని చాలామంది హర్షిస్తున్నారని ఆ నేతలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు విజయవాడ, గుంటూరుకు మధ్యలో ఇల్లు కట్టుకున్నాడని రోజా తెలిపారు. వైసీపీ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఏర్పాటైందని మరో నేత పేర్కొన్నారు.

ఈ వీడియో పోస్టు చేసిన బుద్ధా వెంకన్న దమ్ముంటే రాజీనామా చేయాలంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరారు. "అమరావతే రాజధాని అని ప్రజల్ని మోసం చేశావు, మూడు రాజధానుల అజెండాతో ప్రజాభిప్రాయానికి సిద్ధమా?" అని ప్రశ్నించారు.


Budda Venkanna
YSRCP
Leaders
Amaravati
Jagan
AP Capital

More Telugu News