సుశాంత్ ది ఆత్మహత్య కాదని మొదటిరోజు నుంచీ చెబుతున్నాం: ఫ్యామిలీ ఫ్రెండ్ స్మితా పారిఖ్

  • తీవ్ర వ్యాఖ్యలు చేసిన స్మితా పారిఖ్
  • సుశాంత్ దేనిగురించో భయపడ్డాడని వెల్లడి
  • సుశాంత్ కుటుంబం కూడా ఇది సూసైడ్ అని నమ్మడంలేదన్న స్మిత
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం పలు మలుపులు తిరుగుతూ సినీ ఫక్కీలో ముందుకు పోతోంది. తాజాగా సుశాంత్ ఫ్యామిలీ ఫ్రెండ్ స్మితా పారిఖ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ ది ఆత్మహత్య కాదని తాము మొదటిరోజు నుంచి చెబుతున్నామని తెలిపారు. సుశాంత్ కుటుంబ సభ్యులదీ ఇదే అభిప్రాయమని పేర్కొన్నారు. సుశాంత్ ఆత్మహత్యకు ఉపయోగించినట్టు చెబుతున్న వస్త్రానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు ఇప్పటికీ బయటికి రాలేదని అన్నారు.

ఈ ఘటన జరిగిన జూన్ 14న పితానీ, శామ్యూల్ అనే ఇద్దరు వ్యక్తులే అక్కడ ఉన్నారని, వీరిద్దరూ సుశాంత్ సాంకేతిక వ్యవహారాలు పర్యవేక్షిస్తుంటారని పారిఖ్ వెల్లడించారు. అయితే, సుశాంత్ సోదరి అక్కడికి వచ్చే వరకు ఆగకుండా పితానీ, శామ్యూల్ ఎందుకు హడావుడి ప్రదర్శించారని ప్రశ్నించారు. సుశాంత్ సీలింగ్ కు వేళ్లాడుతుండగా చూసింది పితానీ, శామ్యూల్ మాత్రమేనని తెలిపారు. సుశాంత్ ముఖంపై గాయాలు కనిపించాయని, తమకు తెలిసినంతవరకు సుశాంత్ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకోనేంత పిరికివాడు కాదని స్మితా పారిఖ్ స్పష్టం చేశారు.

"మాజీ మేనేజర్ దిశా సలియా చనిపోయినప్పటి నుంచి సుశాంత్ ఎంతో కలవరపాటుకు గురయ్యాడు. సుశాంత్ ఎందుకు కలత చెందాడో మాకు తెలుసని భావిస్తున్నాం. సుశాంత్ ఎవరి పేర్లు బయటపెట్టకపోయినా, ఎందుకోగానీ దేని గురించో బాగా భయపడ్డాడు. ఆ వ్యక్తులు సుశాంత్ పాత బాడీగార్డులను, వంటవాళ్లను తప్పించేశారు. పితానీ, శామ్యూల్ లను మాత్రం సుశాంత్ తో ఉంచారు. గతేడాది సుశాంత్ బ్యాంకు ఖాతాలో రూ.40 కోట్లు ఉన్నాయి. రియా మేకప్ కోసం, ఇతర ఖర్చుల కోసమే కోట్లు ఖర్చు చేసినట్టు బ్యాంకు రసీదులు చెబుతున్నాయి. సుశాంత్ చనిపోయింది ఆత్మహత్యతో కాదని మేం 100 శాతం కచ్చితంగా చెప్పగలం" అంటూ జాతీయ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

Smita Parikh
Sushant Singh Rajput
Family Friend
Suicide
Bollywood

More Telugu News