Chandrababu: మా ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా నిజాయతీతో పనిచేశారు: మాణిక్యాలరావు మృతిపై చంద్రబాబు విచారం

  • దిగ్భ్రాంతికి గురయ్యానన్న చంద్రబాబు
  • ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ట్వీట్
  • మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం
Chandrababu says he was shocked after knowing Manikyalarao is no more

వివాద రహితుడిగా పేరుపొందిన మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు స్పందిస్తున్నారు. మాణిక్యాలరావు కరోనాతో చనిపోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు మరణం దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దేవాదాయశాఖ మంత్రిగా నిజాయతీతో కూడిన సేవలు అందించారని కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందిస్తూ, ఫొటోగ్రాఫర్ గా కెరీర్ ఆరంభించి, మంత్రిగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన మాణిక్యాలరావు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించేవారని, కానీ, కరోనాతో పోరాడుతూ ఆయన మృతి చెందారన్న వార్త ఎంతో బాధ కలిగించిందని పేర్కొన్నారు.

More Telugu News