ఇక మా వల్ల కాదు.. ఆయనతో కలిసి పనిచేయలేం: రాజస్థాన్ కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు

రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం అంతకంతకూ ముదురుతోంది. ఢిల్లీ శిబిరంలో ఉన్న కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్‌తో కలిసి పనిచేయలేమని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. యువనేత సచిన్ పైలట్‌కు పోలీసు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌వోజీ) అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అసమ్మతి ఎమ్మెల్యేలు ఈ మేరకు తమ అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టినట్టు సమాచారం.

ప్రభుత్వం హద్దులు దాటి ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు.. సీఎం తీరుతో ఇప్పటికే అలసిపోయి ఉన్నామని, ఇక తమ వల్ల కాదని చెప్పారు. సచిన్ పైలట్‌కు ఎస్‌వోజీ లేఖ రాయడం గెహ్లట్ పరాకాష్ఠకు నిదర్శనమని అన్నారు. డిప్యూటీ సీఎం, అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే ఇలాంటి నోటీసు రావడం ఇదే తొలిసారని, హోం మంత్రి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న గెహ్లట్‌కే ఇలా పంపడం సాధ్యమైందని విరుచుకుపడినట్టు తెలుస్తోంది. సంక్షోభ నివారణ కోసం రంగంలోకి దిగిన అధిష్ఠానం జరిపిన సంప్రదింపుల తర్వాత తాము కాంగ్రెస్ వెంటే ఉన్నామని ఎమ్మెల్యేలు చెప్పడం గమనార్హం.

Rajasthan
ashok gehlot
Congress
Rebel MLAs

More Telugu News