యస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్ కు చెందిన రూ. 1,400 కోట్ల విలువైన ఆస్తుల సీజ్!

  • డీహెచ్ఎఫ్ఎల్ వాధావన్ సోదరులకు చెందిన ఆస్తులు కూడా సీజ్
  • యస్ బ్యాంక్ కుంభకోణంపై విచారణ జరుపుతున్న ఈడీ, సీబీఐ
  • స్కాంలో రాణా కపూర్, అతని భార్య, ముగ్గురు కుమార్తెలు
యస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. ఆయనకు చెందిన రూ. 1,400 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. ఈ ఆస్తులు లండన్, న్యూయార్క్, ఢిల్లీ, ముంబైలలో ఉన్నాయి. మనీ లాండరింగ్ చట్టం కింద వీటిని సీజ్ చేసింది. ఇదే సమయంలో డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లైన కపిల్, ధీరజ్ వాధావన్ సోదరులకు చెందిన రూ. 1,400 కోట్ల విలువైన ఆస్తులను కూడా సీజ్ చేసింది.

రాణా కపూర్ కు చెందిన ఆస్తుల్లో ముంబైలోని ఒక బంగ్లాతో పాటు పలు ఫ్లాట్స్ ఉన్నాయి. ఢిల్లీలోని రూ. 685 కోట్ల విలువైన బంగ్లా కూడా సీజ్ చేసిన వాటిలో ఉంది. కపిల్, ధీరజ్ లకు సంబంధించి సీజ్ చేసిన ఆస్తుల్లో 12 అపార్టుమెంటులు, పూణేలో స్థలం, లండన్, ఆస్ట్రేలియా, న్యూయార్క్ లలోని ప్రాపర్టీలు ఉన్నాయి.

పెద్ద ఎత్తున లోన్లను ఇవ్వడం ద్వారా రాణా కపూర్, అతని కుటుంబసభ్యులు భారీగా సంపదను పోగేసుకున్నారని వీరిపై విచారణ జరుగుతోంది. కపిల్ వాధావన్ నుంచి రూ. 600 కోట్ల లంచాన్ని తీసుకున్నారంటూ గత నెలలోనే రాణా కపూర్, అతని భార్య బిందు, ముగ్గురు కుమార్తెలతో  పాటు 13 మందిపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

Yes Bank
DHFL
Rana Kapoor
Wadhawan brothers
Enforcement Directorate
CBI
Assets Seize

More Telugu News