నాలుగు నెలలుగా కట్టని ఇంటి అద్దె.. రెట్టించి అడిగాడని యజమాని హత్య

  • చెన్నైలోని కుండ్రటూరులో ఘటన
  • అద్దె చెల్లించాల్సిందేనని పట్టుబట్టిన ఇంటి యజమాని
  • కోపం పట్టలేక అర్ధరాత్రి కత్తితో దాడిచేసి చంపేసిన అద్దెదారు కొడుకు
లాక్‌డౌన్ కారణంగా నాలుగు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో అడిగిన పాపానికి ఇంటి యజమానిని కత్తితో పొడిచి చంపేశాడో అద్దెదారు కొడుకు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని కుండ్రటూరులో ధనరాజ్ అనే వ్యక్తి గుణశేఖర్ (51) ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ప్రతినెల క్రమం తప్పకుండా అద్దె కడుతున్న ధనరాజ్ లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందుల పాలవడంతో నాలుగు నెలలుగా అద్దె చెల్లించడం లేదు.

తాజాగా, అద్దె కోసం ధనరాజ్‌పై గుణశేఖర్ ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కోపం పట్టలేకపోయిన ధనరాజ్ కుమారుడు అజిత్ అర్ధరాత్రి వేళ గుణశేఖర్ ఇంటికి వెళ్లి అతడిపై కత్తితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన గుణశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Chennai
Lockdown
tenant
Murder

More Telugu News