మహిళను వేధించిన అమరావతి ఎస్సై, ఆయన డ్రైవర్‌ను అరెస్ట్ చేయండి: రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాలు

  • వారం రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేసేలా విచారణ పూర్తి చేయాలి
  • ఎస్సై గత ప్రవర్తనకు సంబంధించిన నివేదిక కోరిన కమిషన్
  • పరారీలో ఎస్సై రామాంజనేయులు, డ్రైవర్
లాడ్జిలో దిగిన ఓ జంటను బెదిరించి డబ్బులు వసూలు చేయడమే కాకుండా, మహిళను వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమరావతి ఎస్సై రామాంజనేయులుపై చర్యలకు మహిళా కమిషన్ ఉపక్రమించింది. ఎస్సైతోపాటు ఆయన డ్రైవర్ సాయికృష్ణను అరెస్ట్ చేసి వారం రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేసేలా విచారణ పూర్తి చేయాలంటూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. ఎస్పీ ఆదేశాలతో తుళ్లూరు డీఎస్పీ ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

ఎస్సై గత ప్రవర్తనకు సంబంధించిన నివేదికను కూడా కోరినట్టు మహిళా కమిషన్ కార్యదర్శి తెలిపారు. మరోవైపు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సైని గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు సస్పెండ్ చేశారు. ఎస్సై, అతడి డ్రైవర్ ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, సత్ప్రవర్తన లేని సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.


More Telugu News

women commission vasireddy padma Amaravati SI