బిస్కెట్ పరిశ్రమలో గ్యాస్ లీక్.. మంటలు అంటుకుని ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలు

లాక్‌డౌన్‌ అనంతరం తెరుచుకుంటున్న పరిశ్రమల్లో గ్యాస్ లీక్‌ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో గ్యాస్‌ లీక్‌ ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం తెలంగాణలో కుమరం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో ఎస్‌పీఎం కాగితపు పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌ అయింది. ఈ రోజు రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండలం మేకగూడ శివారులో ఓ బిస్కెట్‌ పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీ కలకలం రేపింది.

బిస్కెట్‌ పరిశ్రమలో గ్యాప్ పైప్‌ లీక్‌ కావడంతో మంటలు అంటుకున్నాయి. మంటల ధాటికి ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కార్మికులను శంషాబాద్‌లోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.


More Telugu News