లాక్‌డౌన్ సడలింపు ఎఫెక్ట్.. మొదలైన కార్యకలాపాలు.. రోడ్లు ఫుల్!

Lockdown easing effect Roads are busy with vehicles
  • గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రారంభమైన కార్యకలాపాలు
  • నిన్న వంద నగరాల్లో నడిచిన ఓలా క్యాబ్‌లు
  • భౌతిక దూరం విషయంలో వ్యక్తమవుతున్న ఆందోళన
దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి మూడోదశ లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. అయితే, ఈ దశలో కొన్ని సడలింపులు ఉండడంతో దేశవ్యాప్తంగా ఉన్న గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కార్లు, భారీ వాహనాలతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. క్యాబ్ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా వందకు పైగా నగరాల్లో క్యాబ్‌లు నడిపినట్టు ‘ఓలా’ ప్రకటించింది.

అయితే ఈ సడలింపులు ఊరటనిస్తున్నా, భౌతిక దూరం విషయంలో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. మార్కెట్లకు వస్తున్న వారి మధ్య భౌతిక దూరం పాటించేలా చూడడం అధికారులకు సవాలుగా మారింది. ప్రస్తుత సడలింపుల కారణంగా పరిస్థితులు మళ్లీ గాడి తప్పుతున్నాయని భావిస్తే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని కేంద్రం తెలిపింది. నిన్న కేరళ, ఈశాన్య రాష్ట్రాలు మినహా చాలా రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడులలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

ఇక, సడలింపుల్లో భాగంగా కొన్ని జోన్లలో వస్త్ర, విద్యుత్ సామగ్రి దుకాణాలు, మరమ్మతు షాపులు, హెయిర్ సెలూన్లు తెరుచుకున్నాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లలో పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాల ప్రారంభంలో అయోమయం కొనసాగింది. కొన్ని చోట్ల తెరిచినప్పటికీ ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగులు హాజరు కాలేకపోయారు. గురుగ్రామ్‌లో నిర్మాణ రంగంలో మళ్లీ కార్యకలాపాలు మొదలుకాగా, బెంగళూరు, ఢిల్లీలో నిన్న వ్యక్తిగత వాహనాలు భారీ సంఖ్యలో రోడ్డుపైకి రావడంతో చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలు ఎదురయ్యాయి.
Go Back to Shorts
Lockdown
India
New Delhi
Corona Virus

More Telugu News