India: కరోనా పోరాటవీరులకు సంఘీభావంగా మే 3న త్రివిధ దళాల విన్యాసాలు

Armed forces will show their solidarity towards corona front line fighters
  • కరోనా యోధులకు కృతజ్ఞతలు తెలపనున్న త్రివిధ దళాలు
  • దేశవ్యాప్తంగా విన్యాసాలు ఉంటాయన్న జనరల్ బిపిన్ రావత్
  • పోలీసులు అద్భుతంగా విధులు నిర్వర్తిస్తున్నారని వెల్లడి 
కంటికి కనిపించని అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ ను ప్రాణాలకు తెగించి ఎదుర్కొంటున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను చూసి భారత త్రివిధ దళాలు అచ్చెరువొందాయి. అందుకే కరోనాపై ముందుండి పోరాడుతున్న యోధులకు సంఘీభావంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మే 3న ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్త విన్యాసాలు చేపట్టనున్నాయి.

 శ్రీనగర్ నుంచి తిరువనంతపురం వరకు, దిబ్రూగఢ్ నుంచి కచ్ వరకు భారత వాయుసేన విన్యాసాలు చేపడుతుందని, నేవీ బలగాలు సముద్ర తీరాల్లో నౌకలు నిలిపి ఉంచుతాయని, వాటి నుంచి బయల్దేరే హెలికాప్టర్లు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులపై పూలవర్షం కురిపిస్తాయని, ప్రతి జిల్లాలోని కరోనా ఆసుపత్రి వద్ద సైన్యం మౌంటెన్ బ్యాండ్స్ ప్రదర్శిస్తారని త్రివిధ దళాల మహాధిపతి జనరల్ బిపిన్ రావత్ (సీడీఎస్) వెల్లడించారు.

పోలీసులు అద్భుతంగా విధులు నిర్వర్తిస్తున్నారని, రెడ్ జోన్లలో సైన్యాన్ని దించాల్సిన అవసరం లేకుండా చేశారని ఆయన కొనియాడారు. ఈ మేరకు బిపిన్ రావత్ ఓ సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి వాయుసేన చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ఎం నరవాణే కూడా హాజరయ్యారు.
India
Army
Navy
Air Force
CDS
Corona Virus

More Telugu News