punjab: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రోడ్డుపై ఆపినందుకు కలకలం.. పోలీసు చేతిని నరికేసిన వైనం.. వీడియో ఇదిగో

Punjab policemans hand chopped two others injured in attack by group defying coronavirus lockdown
  • పంజాబ్‌లో ఘటన
  • మరో ఇద్దరు పోలీసులకు గాయాలు
  • కర్ఫ్యూ పాసులు చూపించాలని అడిగిన పోలీసులు
  • వాహనంతో ఢీ కొట్టి, కత్తితో దాడి

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు శ్రమిస్తోన్న పోలీసులపై దాడులు జరుగుతుండడం కలకలం రేపుతోంది. పంజాబ్‌లోని పటియాలా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులపై కొందరు  దాడి చేశారు.  

ఈ దాడిలో ఓ పోలీసు చేతిని నరికేసి, మరో ఇద్దరి పోలీసు అధికారులను తీవ్రంగా గాయపర్చారని పోలీసులు ప్రకటించారు. సిక్కు వర్గానికి చెందిన నిహంగ్స్‌ ఈ ఘటనకు పాల్పడ్డారని వివరించారు. వారంతా వాహనంలో కూరగాయల మార్కెట్‌ మీదుగా వెళ్తున్న సమయంలో పోలీసులు వారిని ఆపి ప్రశ్నించారు. కర్ఫ్యూ పాసులు చూపించాలని వారిని పోలీసులు కోరారు.  

దీంతో వారు తమ వాహనంతో గేటును, బారికేడ్లను ఢీ కొట్టారు. అనంతరం ఆ బృందంలోని సభ్యులు పోలీసులపై దాడి చేశారు. అసిస్టెంట్‌ సబ్ ఇన్‌స్పెక్టర్‌ చేతిని కత్తితో నరికేశారని పటియాలా పోలీసులు మీడియాకు వివరించారు. మరో ఇద్దరు పటియాలా పోలీసుల చేతులపై గాయాలయ్యాయని తెలిపారు.  

గాయాలపాలైన పోలీసులకు ఆసుపత్రుల్లో చికిత్స అందుతోందని చెప్పారు. ఈ దాడికి పాల్పడిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.    
 
కాగా, పంజాబ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 151 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌.. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన చేశారు. దేశ వ్యాప్తంగానూ పొడిగించాలని ఆయన నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా సూచించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News