Andhra Pradesh: కడపలో పుట్టిన కరోనా కుమారి.. కరోనా కుమార్!

Corona Kumar and Corona Kumari born in Kadapa
  • కడప జిల్లా వేంపల్లె ఆసుపత్రిలో పుట్టిన ఇద్దరు పిల్లలు
  • ఇద్దరికీ కరోనా పేర్లు పెట్టిన వైద్యుడు
  • అంగీకరించిన తల్లిదండ్రులు
ప్రస్తుత విపత్కర సమయంలో ఏపీలో పుట్టిన ఇద్దరు పిల్లలకు కరోనా పేరు కలసి వచ్చేలా నామకరణం చేశారు. గతంలోనూ ఇలాంటి సందర్భాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో అమెరికా తొలి స్పేస్ స్టేషన్ స్కైలాబ్ 1979లో హిందూ మహాసముద్రంలో కుప్పకూలింది. ఆ సమయంలో పుట్టిన వారికి ‘స్కైలాబ్’ అనే పేర్లు పెట్టారు. ఇలాంటి సందర్భాలు చరిత్రలో అనేకం ఉన్నాయి. తాజాగా ప్రపంచాన్ని కరోనా కబళిస్తున్న నేపథ్యంలో తాజాగా పుట్టిన వారికి కరోనా పేర్లు పెడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వేంపల్లె పట్టణంలో పుట్టిన ఇద్దరికి ఈ వైరస్ పేర్లు పెట్టారు. మండలంలోని అలిరెడ్డిపల్లెకు చెందిన రమాదేవి, తాళ్లపల్లెకు చెందిన శశికళ పురిటి నొప్పులతో పట్టణంలోని బాషా ఆసుపత్రిలో చేరారు. నిన్న వీరిలో ఒకరికి అబ్బాయి జన్మించగా, మరొకరికి అమ్మాయి పుట్టింది. ఆసుపత్రి నిర్వాహకుడు అయిన డాక్టర్ బాషా వీరికి ఆపరేషన్ చేసి పురుడు పోశారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో అబ్బాయికి కరోనా కుమార్, అమ్మాయికి కరోనా కుమారి అని పేర్లు పెట్టారు. ఇందుకు వారి తల్లిదండ్రులు కూడా అంగీకరించడంతో వాటినే ఖాయం చేశారు.  
Andhra Pradesh
Kadapa District
corona kumar
corona kumari

More Telugu News