Hostels: హాస్టళ్లు బంద్ చేస్తున్నారన్న వార్తలు అబద్ధం: సైబరాబాద్ వసతి గృహాల అసోసియేషన్

  • విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నామన్నది అబద్ధం
  • హాస్టళ్లలో ఉండే వారి తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు
  • ప్రభుత్వ సూచనల మేరకు తెరిచే ఉంచుతున్నాం

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్ డౌన్ ప్రకటించడంతో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లోని అన్ని ప్రైవేట్ హాస్టళ్లను మూసివేస్తుండటంతో అందులో నివసించే విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కడ ఉండాలన్న ప్రశ్నలు తలెత్తుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సైబరాబాద్ వసతి గృహాల అసోసియేషన్ ప్రతినిధులు స్పందించారు. హైదరాబాద్ లో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, హాస్టల్స్ బంద్ చేస్తున్నట్టు తాము ఎక్కడా ప్రకటించలేదని, విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నామంటూ వస్తున్న వార్తలు కరెక్టు కాదని అన్నారు. ఈ అసత్య ప్రచారాలు నమ్మొద్దని, ప్రభుత్వ సూచనల మేరకు తెరిచే ఉంచుతున్నామని, హాస్టల్స్ లో ఉన్న వాళ్లకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.  

హాస్టళ్లలో ఎవరైతే ఉంటున్నారో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. సైబరాబాద్ ఐటీ జోన్ లో ఐదు వందలకు పైగా హాస్టల్స్ ఉన్నాయని, వాటిలో ఎక్కువ శాతం ఉంటోంది ఐటీ ఉద్యోగులేనని తెలిపారు. ఇందులో  అధిక శాతం మంది హాస్టల్స్ నుంచే పని చేస్తున్నారని చెప్పారు.

More Telugu News