మమ్మల్ని కాపాడండంటూ వేడుకుంటున్న మనీలాలోని తెలుగు విద్యార్థినులు

  • ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం
  • ఫిలిప్పీన్స్ లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులకు తప్పని ఇక్కట్లు
  • భారత్ వచ్చేందుకు విమానాల్లేక అవస్థలు
  • మనీలా ఎయిర్ పోర్టు నుంచి గెంటేసిన అధికారులు
కరోనా మహమ్మారి కారణంగా ఎక్కడివాళ్లు అక్కడే స్తంభించిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదివేందుకు పెద్ద సంఖ్యలో వెళ్లిన తెలుగు విద్యార్థులు కూడా కరోనా కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. కొందరు తెలుగు విద్యార్థినులు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా ఎయిర్ పోర్టులో నిలిచిపోయారు. తమను కాపాడాలంటూ తాజాగా వారు విడుదల చేసిన వీడియో ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఈ విద్యార్థినులందరూ ఉత్తరాంధ్రకు చెందినవారు. ఫిలిప్పీన్స్ లో కరోనా వేగంగా పాకుతోందని, తాము తీవ్ర ఆందోళనలో ఉన్నామని తెలిపారు. తమను సొంతవారి చెంతకు చేర్చాలంటూ వారిలో ఓ అమ్మాయి చేతులు జోడించి వేడుకుంది.  

ఫిలిప్పీన్స్ లోని తెలుగు విద్యార్థులు మలేసియా మీదుగా భారత్ వద్దామనుకుంటే కౌలాలంపూర్ నుంచి విమాన సర్వీసులు రద్దయ్యాయి. అటు మనీలా నుంచి నేరుగా భారత్ కు విమానసర్వీసులు లేవు. ఈ నేపథ్యంలో, మనీలా ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను అక్కడి అధికార వర్గాలు గెంటేశాయి. ఇక్కడి రెస్టారెంట్లు, హోటళ్లు కూడా మూతపడ్డాయని, తమ బాధలు ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియడంలేదని ఉత్తరాంధ్ర విద్యార్థినులు వాపోయారు.
q
Go Back to Shorts
Telugu Students
Corona Virus
Philippines
Manila
India
Andhra Pradesh

More Telugu News