కరోనాపై కేసీఆర్ అత్యవసర అత్యున్నతస్థాయి సమావేశం.. కీలక ప్రకటన చేసే అవకాశం

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు 13కి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన అత్యవసర అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ సమావేశంలో మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్‌లతో పాటు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం కీలక సూచనలు చేస్తూ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

కరోనాను ఎదుర్కొనేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సీఎం కేసీఆర్ మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని అన్నారు.


More Telugu News