Sensex: చరిత్రలో ఎన్నడూ లేనంతగా కుప్పకూలిన మార్కెట్లు.. వేలాది పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

  • 2,919 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 868 పాయింట్లు పతనమైన నిఫ్టీ
  • మార్కెట్లను ముంచేసిన డబ్ల్యూహెచ్ఓ ప్రకటన
Sensex Crashes nearly 3000 Points

చరిత్రలో ఎన్నడూ లేనంతగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. కరోనా వైరస్ ను భయంకరమైన మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో... ఇన్వెస్టర్లు రెండో ఆలోచన లేకుండా అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో, ఇప్పటికే కుదేలైన మార్కెట్లు ఈరోజు పాతాళాన్ని తాకాయి.

అంతర్జాతీయంగా చమురు ధరలు పతనం కావడం కూడా మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 3,200 పాయింట్లకు పైగా నష్టపోయింది. అన్ని సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2,919 పాయింట్లు నష్టపోయి 32,778కి పడిపోయింది. నిఫ్టీ 868 పాయింట్లు పతనమై 9,590కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో ఒక్క కంపెనీ కూడా లాభాలను ఆర్జించలేకపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-12.11), ఓఎన్జీసీ (-11.93), యాక్సిస్ బ్యాంక్ (-11.60), ఐటీసీ (-10.96), టీసీఎస్ (-9.29) టాప్ లూజర్లుగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News