పెళ్లి వేడుకలకు వెళ్తూ నదిలో పడిన బస్సు.. 24 మంది జలసమాధి

  • రాజస్థాన్‌లోని బుండి జిల్లాలో ఘటన
  • అదుపు తప్పి మేజ్ నదిలో పడిన బస్సు
  • అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణ
పెళ్లి వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు నదిలో పడిన ఘటనలో 24 మంది జలసమాధి అయ్యారు. మరింతమంది గాయపడ్డారు. రాజస్థాన్‌లోని బుండి జిల్లాలో జరిగిందీ దుర్ఘటన. పెళ్లి కోసం వరుడు కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి కోట నుంచి సవాయ్‌మాధోపూర్‌కు బస్సులో బయలుదేరారు. బస్సు బూండిలోని కోట లాల్‌సాత్ మెగా హైవే పైనుంచి వెళ్తుండగా బ్రిడ్జిపై అదుపుతప్పి మేజ్ నదిలో పడింది.

ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నారు. వీరిలో 24 మంది మృతి చెందారు. వీరిలో 11 మంది మహిళలు, 10 మంది పురుషులు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Rajasthan
Marriage
Bus Accident

More Telugu News