డాక్టర్ సీట్లో కూర్చుని రోగులకు మందులు రాసిన మతిస్థిమితంలేని వ్యక్తి

  • మధ్యప్రదేశ్ లో విచిత్ర ఘటన
  • మందుల షాపు సిబ్బంది అప్రమత్తతతో వెల్లడైన నిజం
  • తనను ఎయిమ్స్ వైద్యుడిగా పేర్కొన్న మానసికరోగి 
మధ్యప్రదేశ్ లోని చత్తర్ పూర్ జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ మతిస్థిమితం లేని వ్యక్తి ఆసుపత్రిలో డాక్టర్ సీట్లో కూర్చుని రోగులకు మందులు రాయడం కలకలం రేపింది. ఓ ఆసుపత్రిలో ఉన్న మందుల షాపుకు రోగులు ఎప్పట్లాగానే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో వచ్చారు. మందుల షాపులో ఉన్న వ్యక్తి రోగులతో మాట్లాడుతూ వారి అనారోగ్య సమస్యలు తెలుసుకున్నాడు. అయితే వారు చెప్పిన సమస్యలకు, మందుల చీటీలో డాక్టర్ రాసిన మందులకు అస్సలు పొంతన లేకపోవడంతో అతడికి అనుమానం వచ్చింది.

నేరుగా డాక్టర్ రూములోకి వెళ్లి దిగ్భ్రాంతికి గురయ్యాడు. అక్కడ డాక్టర్ కు బదులు మరో వ్యక్తిని చూసి నివ్వెరపోయాడు. వెంటనే ఈ విషయాన్ని ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పడంతో వారు అతడ్ని ప్రశ్నించడంతో అసలు విషయం వెల్లడైంది. వాస్తవానికి అతను డాక్టర్ కాదు. అతడి మాటల ద్వారా మతిస్థిమితం లేని వ్యక్తి అని తెలుసుకున్నారు. తనను ఎయిమ్స్ వైద్యుడిగా చెప్పుకుంటూ, రోగుల బాధలు తీర్చడమే తన లక్ష్యమంటూ తెలిపాడు. అప్పటికే అనేకమంది రోగులు అతడితో మందులు రాయించుకోగా, వారందరికీ సర్దిచెప్పేసరికి ఆసుపత్రి వర్గాలకు తలప్రాణం తోకకు వచ్చినంత పనైంది.


More Telugu News

Fake Doctor Madhya Pradesh Chatarpur