Telangana: ఇద్దరికి కరోనా సోకిందంటూ తప్పుడు ప్రకటన చేసిన గాంధీ ఆసుపత్రి డాక్టర్... తీవ్రంగా స్పందించిన సర్కారు!

  • బ్లడ్ శాంపిల్ పాజిటివ్ వచ్చిందన్న వైద్యుడు
  • తప్పుడు సమాచారం ఇచ్చారని తేలడంతో చర్యలు
  • విధుల నుంచి తొలగించామన్న మెడికల్ డైరెక్టర్

తెలంగాణలో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా బ్లడ్ శాంపిల్ రిపోర్టు వచ్చిందని మీడియాకు చెప్పిన గాంధీ హాస్పిటల్ డాక్టర్ పై వేటు పడింది. రాష్ట్రానికి కరోనా వైరస్ వచ్చిందన్న వార్త వైరల్ కాగా, దీనిపై కేసీఆర్ ప్రభుత్వం మండిపడింది. తప్పుడు సమాచారాన్ని అందించారన్న కారణంతో సదరు డాక్టర్ ను తక్షణం విధుల నుంచి తొలగించాలని వైద్య ఆరోగ్య శాఖ సిఫార్సు చేసింది.

కరోనా లక్షణాల్లో ప్రధానమైన జలుబు, దగ్గు, జ్వరంతో ఆసుపత్రికి వస్తున్న వారే తప్ప, ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేసిన ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడటంతో పాటు, కరోనాపై ప్రజల్లో ఆందోళన పెంచినందుకు ఆ డాక్టర్ ను విధుల నుంచి తొలగించి, వైద్య శాఖకు సరెండర్ చేశామని వెల్లడించారు. ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులో చేరిన కొందరిని డిశ్చార్జ్ చేశామని, మరో ఆరుగురి రక్త పరీక్షల నివేదికలు మాత్రం రావాల్సివుందని ఆయన స్పష్టం చేశారు. ఇంతవరకూ రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వివరించారు. 

More Telugu News