మండలిని రద్దు చేస్తాననడం మొండితనమే!: యనమల
శాసన మండలిని రద్దు చేయాలని ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కౌన్సిల్లో ఇప్పటికే రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారని ఆయన గుర్తు చేశారు. బిల్లులపై నిర్ణయాలకు రెండు లేక మూడు నెలల సమయం పడుతుందని, అయినప్పటికీ మండలి రద్దు చేస్తాననడం మొండితనమే అవుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్సీలందరూ దృఢంగా నిలబడ్డారని ఆయన తెలిపారు. మండలిని రద్దు చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం అమలు అంత సులువు కాదని ఆయన చెప్పారు.