Andhra Pradesh: నేటి మధ్యాహ్నం ఏకాంతంగా భేటీ కానున్న జగన్-కేసీఆర్

  • మంత్రులు, అధికారులకు కూడా దూరం
  • 9, 10 షెడ్యూల్ సంస్థల విభజన, ఉద్యోగుల బదలాయింపు వంటి వాటిపై చర్చ
  • నాలుగో సారి భేటీ కానున్న సీఎంలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావులు ఇద్దరూ నేటి మధ్యాహ్నం 12 గంటలకు భేటీ కానున్నారు. ప్రగతి భవన్‌లో ఏకాంతంగా భేటీ కానున్నారని, మంత్రులు, అధికారులు కూడా వారి వెంట ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. గతేడాది సెప్టెంబరు 23న ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ మరోమారు సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం, కేంద్ర సహకారం లేకపోవడం వంటి విషయాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. రాయలసీమకు నీళ్లందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచాలన్న జగన్ నిర్ణయంపై తెలగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో దీనిపైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది. 9,10 షెడ్యూల్ సంస్థల విభజన, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదలాయింపు తదితర వాటిపై చర్చించనున్నట్టు సమాచారం.  
Andhra Pradesh
Telangana
Jagan
KCR

More Telugu News