India: లంచంగా గేదెను తోలుకొచ్చి ఇవ్వబోయిన మహిళ!

  • కుట్ర అంటున్న అధికారులు
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న క్లర్క్ ఆసుపత్రిలో ఉన్నాడని వెల్లడి
  • మధ్యప్రదేశ్ లో ఘటన

దేశంలో లంచగొండితనం ఇంకా రూపుమాసిపోలేదు. ఏదో ఒక రూపంలో వెల్లడవుతూనే ఉంది. తాజాగా మధ్యప్రదేశ్ లో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది లంచం అడిగారని తన ఇంట్లోని గేదెను తోలుకొచ్చిందొక మహిళ!

పూర్వీకుల ఆస్తిని తన పేర బదలాయించుకోవడానికి అవసరమైన పత్రాల కోసం లంచం అడగ్గా ఓసారి నగదు రూపంలో ఇచ్చుకున్న రామకాళి పటేల్ అనే మహిళ, మళ్లీ లంచం అడగడంతో తన వద్ద అంత సొమ్ము లేదంటూ గేదెను తహసీల్దార్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చింది. సిద్ధి జిల్లాలోని సిహ్వాల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

నౌధియా గ్రామానికి చెందిన రామకాళి ఆస్తి పత్రాలకు సంబంధించి తహసీల్దార్ మైకేల్ టిర్కీని  సంప్రదించింది. పని జరగాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని కార్యాలయం సిబ్బంది చెప్పారు. చేసేది లేక వాళ్లు అడిగినంత చెల్లించింది. పని జరగకపోగా మళ్లీ లంచం అడగడంతో తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ, లంచంగా గేదెను తీసుకోమని తోలుకొచ్చింది.

దీనిపై తహసీల్దార్ ను మీడియా వివరణ కోరగా, రామకాళి పత్రాల వ్యవహారం ఎస్డీఎం కార్యాలయానికి చెందినదని, కానీ తహసీల్దార్ కార్యాలయం వారు లంచం అడిగారని ఆమె ఆరోపిస్తోందని తెలిపారు. నవంబరు 14నే ఆమె పని పూర్తయిందని, పత్రాలకు సంబంధించి ఓ కాపీ కూడా అందజేశామని టిర్కీ వెల్లడించారు. ఎస్డీఎం అధికారులు కూడా ఈ కుట్రలో భాగమై ఉండచ్చని, లంచం తీసుకున్నాడని సదరు మహిళ ఆరోపిస్తున్న క్లర్కు మెదడు సంబంధిత వ్యాధితో మూడ్నెల్లుగా ఆసుపత్రిలో ఉన్నాడని చెబుతున్నారు.

More Telugu News