Techchie: ప్రియుడి మాట నమ్మి పెళ్లి కూతురిలా తయారై కల్యాణ మండపానికి వెళ్లి... అభాసుపాలైన యువతి!

  • ఎంఎన్సీలో పనిచేస్తున్న యువతి
  • అదే కంపెనీలో ఉద్యోగితో సహజీవనం
  • పెళ్లి ఏర్పాట్లు చేశానని నమ్మించి మోసం
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో టెక్కీగా పనిచేస్తోంది. అదే ఆఫీసులో పని చేస్తున్న మరో ఉద్యోగితో ప్రేమలో పడింది. కులాలు వేరని వారిస్తే, తన వారిని ఒప్పిస్తానని అతను చెప్పిన మాటలు నమ్మింది. ఏడాది సహజీవనం తరువాత పెళ్లికి ఒత్తిడి చేయగా, కల్యాణ మండపం బుక్ చేశానని, ఆ సమయానికి రావాలని చెబితే, పెళ్లి కూతురిగా అక్కడికి వెళ్లి, కల్యాణ మండపానికి తాళం వేసుండటాన్ని చూసి అవాక్కైంది. తాను దారుణంగా మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, సికింద్రాబాద్ లో ఉంటున్న బాధితురాలు, ఓ ఎంఎన్సీలో నాలుగేళ్లుగా పని చేస్తుండగా, మాసబ్ ట్యాంక్ లో ఉండే ప్రవీణ్, పరిచయం అయ్యాడు. వారి స్నేహం ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుందామని ప్రవీణ్ చెబితే, నమ్మింది. కులాలు వేరైనా, తన ఫ్యామిలీని ఒప్పిస్తానని నమ్మ బలికితే, సంవత్సరంగా అతనితో సహజీవనం చేసింది. బాపట్లలోని తన బంధువుల ఇంటికి తీసుకెళ్లి, కాబోయే భార్యని చెబితే, పెళ్లి చేసుకుంటాడనే భావించింది. కంపెనీ వేడుకలు, ఇతర శుభకార్యాలకు ఇద్దరూ కలిసే వెళ్లేవారు. అతనికి అవసరమైనప్పుడల్లా ఆర్థిక సాయం చేసింది.

ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తెస్తుండగా, ప్రవీణ్ తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించలేదు. నవంబర్ లో ప్రవీణ్ ఇంటికి వెళ్లిన బాధితురాలు, తనకు అన్యాయం చేయవద్దని ప్రాధేయపడింది. అదే రోజున ఫోన్ చేసిన ప్రవీణ్, పెళ్లికి తన ఫ్యామిలీ అంగీకరించిందని, నవంబర్ 13న హైదరాబాద్ లోని ప్యారడైజ్ లో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నానని, అక్కడికి వచ్చేయాలని చెప్పాడు. పెళ్లి సమయానికి ముస్తాబై, తన కుటుంబీకులు, బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లగా, ఫంక్షన్ హాల్ కు తాళం వేసివుంది. అక్కడ ఎటువంటి పెళ్లికీ కల్యాణ మండపం బుక్ కాలేదని తెలుసుకుని అభాసుపాలైంది.

ప్రవీణ్ ఫోన్ కూడా పనిచేయలేదు. తనను మోసం చేశాడని తెలుసుకోవడానికి ఆమెకు సమయం పట్టలేదు. ఆపై దాదాపు నెల రోజుల పాటు అతని కోసం గాలించినా ఫలితం దక్కలేదు. ప్రవీణ్ కనిపించక పోవడంతో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు, ప్రవీణ్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు.

More Telugu News