Tamilnadu: మాజీ ప్రియుడిని హత్య చేసిన తమిళ టీవీ నటి!

  • సినిమాల్లో అవకాశం కోసం వచ్చిన యువకుడితో సంబంధం
  • ఆపై మనసు మార్చుకున్నా వినని యువకుడు
  • ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన టీవీ నటి దేవి

తనతో ఉన్న వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని ఒత్తిడి చేస్తున్న వ్యక్తిని తమిళ టీవీ నటి దారుణంగా హత్య చేసింది. ఈ కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిని పెరంబూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, దేవి అనే యువతి, టీవీ సీరియళ్లలో నటిస్తూ, తన భర్త శంకర్ తో వడపళని ప్రాంతంలో నివాసం ఉంటుండగా, ఆమెకు సినిమాలపై ఆసక్తితో చెన్నైకి వచ్చిన మధురై యువకుడు రవి (38) పరిచయం అయ్యాడు.

ఈ క్రమంలో వారిద్దరికీ వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల మనసు మార్చుకున్న దేవి, ప్రియుడిని వదిలించుకోవాలన్న ఉద్దేశంతో, ఇల్లు మారింది. నటిగా అవకాశాలు తగ్గడంతో టైలర్ గా పని చేస్తోంది. ఆమె కోసం గాలించిన రవికి దేవి సోదరి లక్ష్మి చిరునామా లభించగా, అక్కడికి వెళ్లి దేవి కోసం గొడవ పడ్డాడు. ఈ విషయం తెలుసుకుని భర్తతో కలిసి లక్ష్మి ఇంటికి వచ్చిన దేవి, అతన్ని వెళ్లిపోవాలని కోరింది.

అప్పటికే మద్యం తాగి ఉన్న రవి, మరింత గొడవకు దిగాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దేవి ఇనుపరాడ్డుతో అతనిపై దాడికి దిగింది. శంకర్ కూడా కర్ర తీసుకుని అతన్ని కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రవి, అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసును నమోదు చేశారు. దేవి, శంకర్, లక్ష్మిలను అదుపులోకి తీసుకున్నామని, కేసును విచారిస్తున్నామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News