Telugudesam: చంద్రబాబు కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని చూస్తున్నారు: మంత్రి కొడాలి నాని

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి మూడు రాజధానుల అంశం విషయమై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు చేయడాన్ని మంత్రి కొడాలి నాని తప్పుబట్టారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై చంద్రబాబు చేస్తున్న వాదనను ఉత్తరాంధ్ర, రాయలసీమలోని టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారని, తమ ప్రాంతం అభివృద్ధి చెందితే ‘నువ్వు (చంద్రబాబు) ఎందుకు ఏడుస్తావు? అని అంటున్నారని చెప్పారు.

చంద్రబాబు తమ ప్రాంతాలను అభివృద్ధి చేయకపోగా, సీఎం జగన్ చేస్తుంటే అడ్డుపడొద్దని బాబుకు  విజ్ఞప్తి చేస్తున్నారని అన్నారు. రాజధానిని అమరావతి నుంచి పూర్తిగా తీసేసి వెళ్లిపోతానని జగన్ చెప్పట్లేదని అన్నారు. 'ఏదో కొంపలు మునిగిపోయినట్టు చంద్రబాబు రెచ్చగొట్టడం, టీడీపీ నేతలు ధర్నాలు చేయడం' అంటూ మండిపడ్డారు. ఏదోరకంగా ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని, ఆ ఉచ్చులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గానీ, జనసేన పార్టీ నాయకులు గానీ పడొద్దని కోరుతున్నానని అన్నారు.
Go Back to Shorts
Telugudesam
Chandrababu
Minister
KodaliNani

More Telugu News