NRC: జాతీయ పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

  • ఈ బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు
  • వ్యతిరేకంగా 105 ఓట్లు
  • ఓటింగ్ కు దూరంగా ‘శివసేన’

జాతీయ పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 105 ఓట్లు లభించాయి. ఓటింగ్ సమయంలో 230 మంది సభ్యులు సభలో ఉన్నారు.ఈ బిల్లుపై నిర్వహించిన డివిజన్ ఓటింగ్ లో శివసేన సభ్యులు పాల్గొనలేదు. కాగా, లోక్ సభలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు ఇప్పటికే  ఆమోదం లభించింది.  

అంతకుముందు, పౌరసత్వ సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలా? వద్దా? అనే అంశంపై ఓటింగ్ నిర్వహించారు. ఆ సమయంలో సభలో మొత్తం 223 మంది సభ్యులు ఉన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపొద్దని 124 ఓట్లు, పంపాలని 99 ఓట్లు లభించగా, ఒకరు ఓటింగ్ లో పాల్గొనలేదు. దీంతో, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపేందుకు నిరాకరించినట్టు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. అనంతరం ఈ బిల్లుపై ప్రతిపక్ష సభ్యుల సవరణ ప్రతిపాదనలు వీగిపోయాయి. సభ్యులు చేసిన సవరణల్లో కొన్ని మూజువాణి ఓటుతో వీగిపోయినట్టు వెంకయ్యనాయుడు ప్రకటించారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఆమోదం అనంతరం సభ వాయిదా పడింది.

More Telugu News