పవన్ కల్యాణ్ ను ఏమని పిలవాలో అర్థం కావట్లేదు!: మంత్రి అనిల్ కుమార్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞాని అని, ఆయన్ని ఏమని పిలవాలో తనకు అర్థం కావట్లేదని విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ నడుస్తున్నారని, ఎవరి దమ్ము ఎంతో రాష్ట్ర ప్రజలకు తెలుసని, మొన్నటి ఎన్నికల్లో పవన్ ను రెండు చోట్ల ఓడించినా ఆయనలో మార్పులేదని అన్నారు. సీఎం జగన్ సంక్షేమపాలన చూసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.

కులాలు, మతాల గురించి ఎప్పుడూ మాట్లాడేది, సంస్కార రహితంగా వ్యాఖ్యలు చేసేది పవన్ కల్యాణే అని ఆరోపించారు. 2017లో కర్నూలులో యువతి హత్య ఘటన జరిగింది చంద్రబాబుపాలనలో అని, ఇప్పుడు ప్రశ్నిస్తున్న పవన్ ఆ రెండేళ్లు నిద్రపోయారా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ముందు పేపర్ చదవడం నేర్చుకోవాలని, తన ఫ్యాన్స్ ను సన్మార్గంలో పెట్టడం నేర్చుకోవాలని సూచించారు.


More Telugu News